తూర్పుగోదావరి జిల్లా యువకుడికి కరోనా?.. పరుగులు పెట్టిన అధికారులు!

  • హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వాడపాలెం వ్యక్తి
  • ఇటీవల దక్షిణ కొరియా వెళ్లొచ్చిన వైనం
  • హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి, అక్కడి నుంచి అత్తగారి ఊరికి
హైదరాబాద్‌లో కలకలం రేపిన కరోనా వైరస్ ఇప్పుడు తూర్పుగోదావరి వాసులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తోంది. జిల్లాలోని కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడు దక్షిణ కొరియా వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అనంతరం స్వగ్రామమైన వాడపాలేనికి వెళ్లాడు.

విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ అధికారులు, అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో, అతడికి సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. అప్రమత్తమైన కలెక్టర్ జిల్లా అధికారులు, ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడు స్వగ్రామం నుంచి తన అత్తగారి ఊరైన గోదశపాలెం వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు.  ఈ వార్త కాస్తా వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, బాధితుడికి కరోనా వైరస్ సోకిందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

East Godavari District
Hyderabad
South korea
Corona Virus
vadpalem

More Telugu News